Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu No gas shortage in Andhra Pradesh people should not worry
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ కొరతపై ఊహాగానాలు వస్తుండడం పట్ల ఆయన అధికారులతో చర్చించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం వెల్లడించారు.

అమరావతిలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ కొరత రాకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేవైసీ, ఓటీపీల ద్వారా సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇండక్షన్ స్టవ్‌ల ఉత్పత్తి, పంపిణీని పెంచి వాటి లభ్యతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించి, కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి గ్యాస్ కొరత లేదని, సరఫరా సజావుగా సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh gas shortage
AP LPG supply
Iran war impact
LPG gas reserves
Gas cylinder distribution
City gas distribution network
KG Basin gas
Induction stoves

More Telugu News