PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు

PM Awas Yojana Central Government Increases Assistance to Rs 239 Lakhs Per House in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించే పేదల ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.2.39 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.20 లక్షల రాయితీని అందిస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతంగా రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా రూ.48 వేలు ఉంటాయి. దీనికి అదనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం కోసం మరో రూ.12 వేలు కేటాయిస్తారు.

పావలా వడ్డీకి రూ.80 వేల డ్వాక్రా రుణం.. వడ్డీ ప్రభుత్వానిదే
వీటితో పాటు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీకే రూ.80 వేల బ్యాంకు రుణాన్ని కూడా మంజూరు చేస్తారు. ఈ రుణంపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. పెంచిన ధరల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాల పక్కా ఇంటి కల నెరవేరనుంది.
Go Back to Shorts
PMAY-G
PM Awas Yojana
Andhra Pradesh
AP Housing
Central Government Scheme
Rural Housing
Housing Scheme
DWCRA Loans
Ajay Jain
Poverty Housing

More Telugu News