Rajesh Kumar Sinha: రెండు ఎల్పీజీ నౌకలు హార్ముజ్‌ను దాటాయి... వంటగ్యాస్‌కు ఇబ్బంది లేదు: కేంద్ర ప్రభుత్వం

Rajesh Kumar Sinha Two LPG Ships Cross Hormuz Strait Safely
భారతదేశ జెండాలు కలిగిన రెండు ఎల్పీజీ నౌకలు శనివారం సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దీనితో హార్ముజ్‌కు ఇరువైపుల వందలాది నౌకలు నిలిచిపోయాయి. భారత ప్రభుత్వం సంప్రదింపుల నేపథ్యంలో, భారత జెండాలు కలిగిన నౌకలు వెళ్లడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ క్రమంలో రెండు నౌకలు హార్ముజ్‌ను దాటాయి.

శివాలిక్, నందాదేవి పేరు గల నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని, మార్చి 16 లేదా 17వ తేదీన ఇవి భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

వంట గ్యాస్ విషయంలో ఇబ్బంది లేదు

గృహ వినియోగదారులకు వంట గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. అవసరం లేకున్నా చాలామంది ఆందోళనతో బుకింగ్ చేస్తున్నారని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలని కోరినట్లు కేంద్రం తెలిపింది. ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

వాణిజ్య సిలిండర్ల కొరతపై కూడా కేంద్రం స్పందించింది. ప్రాధాన్యత క్రమంలో వాణిజ్య సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ఎల్పీజీని అక్రమంగా నిల్వ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎల్పీజీ సరఫరాలో గృహాలు, ఆసుపత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. బుకింగ్ కోసం గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజుల కనీస గడువు ఉందని గుర్తు చేసింది.

గల్ఫ్‌లో ఉండిపోయిన భారతీయ నౌకలు సురక్షితంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. అందులోని సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. హర్ముజ్ జలసంధి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. నావికుల కుటుంబ సభ్యులకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని తెలిపింది.
Rajesh Kumar Sinha
LPG
Hormuz Strait
India
cooking gas
Iran
oil tankers
supply
Shivalik

More Telugu News