Chandrababu Naidu: ఏపీ రైతులకు ఉగాది కానుక... రేపే అన్నదాత సుఖీభవ 3.0 సాయం

Chandrababu Naidu Releases Annadata Sukhibhava 30 Funds for AP Farmers
  • అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు శుక్రవారం విడుదల
  • 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,000 చొప్పున జమ
  • కృష్ణా జిల్లా సూరంపల్లిలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
  • ఏడాదికి రూ.20 వేల హామీ పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం
ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0’లో భాగంగా రైతులకు రేపు (మార్చి 13) ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేయనుంది.  మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. శుక్రవారం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది.  

ఏడాదిలో రూ.8,985 కోట్ల సాయం

ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి ఎన్నికల వేళ సూపర్ -6 హామీల్లో పేర్కొంది. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించింది. రేపు మూడో విడతలో రూ.6 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.2,676 కోట్లు ఇవ్వనుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం రూ.8,985 కోట్లు అందించినట్లు అవుతుంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.2,425 కోట్లు.

సూరంపల్లి నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం

అన్నదాత సుఖీభవ 3.0 నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. 5.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.
Chandrababu Naidu
AP Rythu
Annadata Sukhibhava
PM Kisan
Andhra Pradesh Farmers
Farmer Welfare Scheme
AP Government Schemes
YSR Rythu Bharosa
Agriculture AP
Surampalli

More Telugu News