AP Government: ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

AP Government Announces Paternity Leave IVF Benefits for Employees
  • మూడో సంతానానికి పురుష ఉద్యోగులకు 2 నెలల పితృత్వ సెలవులు
  • ఉద్యోగినుల కోసం చైల్డ్ కేర్ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు
  • ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో సంతానలేమికి ఐవీఎఫ్ చికిత్సపై రాయితీ
  • రెండో సంతానం నుంచి రూ.25 వేల ప్రోత్సాహకం
  • పదవీ విరమణకు ముందు ఉద్యోగులకు 15 రోజుల వెల్‌నెస్ లీవ్
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

మహిళా ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం కూడా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 50 మందికి పైగా మహిళా సిబ్బంది ఉన్న కార్యాలయాల్లో తప్పనిసరిగా చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం పింక్ టాయిలెట్లు, షీ క్యాబ్స్ సేవలను మరింత విస్తృతం చేయనున్నారు. దీనికి తోడు రూ.172 కోట్ల వ్యయంతో 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఒక్క విశాఖపట్నంలోనే మూడు హాస్టళ్లను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి లక్ష పట్టణ జనాభాకు కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహం 
అలాగే, సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య చికిత్సలకు రాయితీ కల్పించనున్నారు. రెండో సంతానం నుంచి రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో అధికంగా ఉన్న సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 67.5 శాతంగా ఉన్న సీ-సెక్షన్ల రేటును 40 శాతం కంటే తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పదవీ విరమణకు రెండేళ్లు ముందున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు 'వెల్‌నెస్ లీవ్' పేరుతో సరికొత్త ప్రయోజనాన్ని ప్రకటించింది. దీని కింద ఉద్యోగులకు 15 రోజుల పాటు ప్రత్యేక సెలవుతో పాటు ఆరోగ్య పరీక్షల కోసం రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందించే 'సంజీవని', ప్రతి నాలుగో శనివారం 'ఆరోగ్య ఆంధ్ర ప్రజా వేదిక' వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు వివరించారు.
AP Government
Saurabh Gaur
Andhra Pradesh
Government Employees
Paternity Leave
IVF Treatment
Child Care Centers
Working Women Hostels
Population Control
Wellness Leave

More Telugu News