Khawaja Asif: ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని పాక్ వరకు విస్తరించే ప్రయత్నం జరుగుతోంది: పాక్ రక్షణ మంత్రి ఖవాజా
- ఇరాన్ పై ఇజ్రాయెల్ బలవంతంగా యుద్ధాన్ని రుద్దుతోందన్న ఖవాజా
- ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇండియాను కేంద్రం చేసుకుని కుట్ర జరుగుతోందని ఆరోపణ
- పాక్ సామంత రాజ్యంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ బలవంతంగా యుద్ధాన్ని రుద్దుతోందని ఆయన మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని పాక్ సరిహద్దుల వరకు విస్తరించే 'జయోనిస్ట్ ఎజెండా'లో భాగమని ఆయన విమర్శించారు. గత వందేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శక్తిమంతమైన దేశాలను ఈ జయోనిస్టు భావజాలమే నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు.
అఫ్ఘనిస్థాన్, ఇరాన్, భారత్లను కేంద్రంగా చేసుకుని సాగుతున్న కుట్రకు పాకిస్థాన్ ప్రధాన లక్ష్యంగా మారుతోందని, దీనివల్ల దేశం చివరకు సామంత రాజ్యంగా మారే ప్రమాదం ఉందని ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పాక్ సైనిక, అణు శక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో పాక్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.