Shyambabu Sinha: గని పేలుడులో చచ్చిపోయాడనుకున్నారు... అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చాడు!

Shyambabu Sinha Returns Home After Funeral in Meghalaya Mine Blast
  • ఇటీవల మేఘాలయలో ఓ గనిలో పేలుడు
  • 31 మంది దుర్మరణం
  • 44 ఏళ్ల శ్యాంబాబు సిన్హా కూడా మరణించినట్టు అధికారుల ప్రకటన 
  • తమకు అప్పగించిన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపిన కుటుంబీకులు
  • శ్యాంబాబు నడుచుకుంటూ రావడంతో మొదట భయపడిన కుటుంబ సభ్యులు
మేఘాలయలో జరిగిన ఘోర గని ప్రమాదంలో చనిపోయాడని ప్రకటించి, అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత... ఓ వ్యక్తి సజీవంగా ఇంటికి తిరిగిరావడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఈ వింత ఘటన అసోంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, అధికారులు షాక్‌కు గురవ్వగా, మృతదేహాల గుర్తింపు ప్రక్రియపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, మేఘాలయాలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లా థాంగ్‌స్కు ప్రాంతంలో ఫిబ్రవరి 5న ఒక అక్రమ ర్యాట్-హోల్ బొగ్గు గనిలో డైనమైట్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 31 మంది కార్మికులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో అసోంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన 44 ఏళ్ల శ్యాంబాబు సిన్హా కూడా ఉన్నట్లు గుర్తించారు.

అధికారుల ప్రకటనతో శ్యాంబాబు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు అప్పగించిన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్న సమయంలో, చనిపోయాడనుకున్న శ్యాంబాబు ఇంటికి నడుచుకుంటూ రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి బతికిరావడంతో మొదట భయపడినా, ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు.

ఈ గందరగోళానికి మృతదేహం గుర్తింపులో జరిగిన పొరపాటే కారణమని తేలింది. పేలుడు తీవ్రత, ఆందోళన కారణంగా శ్యాంబాబు కుటుంబం మరొకరి మృతదేహాన్ని తమ వారిదిగా భావించి దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, అసలు శ్యాంబాబు పేరుతో ఎవరి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన అక్రమ మైనింగ్ కార్యకలాపాల భద్రతా లోపాలతో పాటు, విపత్కర పరిస్థితుల్లో మృతదేహాలను గుర్తించే ప్రక్రియలోని డొల్లతనాన్ని కూడా బయటపెట్టింది.
Shyambabu Sinha
Meghalaya mine explosion
Assam
rat hole mining
East Jaintia Hills
illegal mining
body identification
Shyambabu Sinha alive

More Telugu News