Asaduddin Owaisi: తనపై హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన అసోం సీఎం హిమంత

Asaduddin Owaisi files complaint Assam CM Himanta responds
  • బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని వ్యాఖ్య
  • తనపై పిర్యాదు చేస్తే అరెస్టుకు కూడా సిద్ధమన్న హిమంత బిశ్వ శర్మ
  • బంగ్లాదేశ్ చొరబాట్ల అంశంపై తన వైఖరి మారదన్న హిమంత బిశ్వ శర్మ
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనపై హైదరాబాద్ నగర సీపీకి ఫిర్యాదు చేయడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తాను బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని, తనపై ఫిర్యాదు చేస్తే అరెస్టుకు కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

తాను చేసిన పోస్టుకు తనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. "నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం చేయగలను. నాకు ఏ వీడియో గురించి తెలియదు. అతను (అసదుద్దీన్ ఒవైసీ) నాపై కేసు నమోదు చేసి ఉంటే నన్ను అరెస్టు చేయవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు" అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

తాను చొరబాటు అంశం గురించి స్పందించానని, ఆ విషయంలో తన వైఖరి మారదని స్పష్టం చేశారు. నేను నా మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. బంగ్లాదేశ్ చొరబాటులను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. నేను చొరబాట్లకు వ్యతిరేకంగానే ఉంటానని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో హిమంత బిశ్వ శర్మ చేసిన పోస్టుపై అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Asaduddin Owaisi
Himanta Biswa Sarma
Hyderabad
Assam CM
Majlis Party
Bangladesh infiltrators

More Telugu News