Stock Market: బడ్జెట్ దెబ్బ నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు... భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market Recovers After Budget Slump Indices Close With Gains
  • సెన్సెక్స్ 944, నిఫ్టీ 263 పాయింట్ల లాభం
  • చివరి గంటలో హెవీవెయిట్ షేర్లలో బలమైన కొనుగోళ్లు
  • ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగింపు
  • భారీగా పతనమైన వెండి ఫ్యూచర్స్ ధర
బడ్జెట్ రోజున భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో బలంగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ చివరి గంటలో హెవీవెయిట్ షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 263 పాయింట్లు లాభపడి 25,088 వద్ద ముగిసింది.

ఇవాళ్టి ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో 80,387 కనిష్ఠ స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, ఆ తర్వాత 1,345 పాయింట్లు పుంజుకుని 81,732 గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,679 కనిష్ఠ స్థాయి నుంచి కోలుకుని 25,108 స్థాయికి చేరింది. అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్&టీ, మహీంద్రా & మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో చివరి గంటలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

2020 తర్వాత బడ్జెట్ రోజున మార్కెట్లు అత్యంత దారుణంగా పతనం కాగా, ఒక్కరోజులోనే ఈ రికవరీ చోటుచేసుకోవడం గమనార్హం. మార్కెట్లలో భయాన్ని సూచించే ఇండియా VIX సూచీ 8 శాతం తగ్గింది. పవర్‌గ్రిడ్ షేరు 7.6 శాతం లాభంతో సెన్సెక్స్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్, రియల్టీ రంగాలు లాభపడగా, ఐటీ రంగం స్వల్పంగా నష్టపోయింది.

మరోవైపు కమోడిటీ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర 6.4 శాతం తగ్గి కిలో రూ.2,48,600కి చేరింది. బంగారం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి.


Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Adani Ports
HDFC Bank
Budget 2024
Market Recovery
Trading

More Telugu News