Jogi Ramesh: నాకు ఏదైనా జరిగితే లోకేశ్ దే బాధ్యత: జోగి రమేశ్

Jogi Ramesh Comments on Chandrababu and Nara Lokesh After Attack
  • నారా లోకేశ్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందన్న జోగి రమేశ్
  • తనను, తన తమ్ముడిని అక్రమంగా 83 రోజులు జైల్లో పెట్టారని మండిపాటు
  • తనకు అండగా జగనన్న, వైసీపీ సైన్యం ఉందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను 83 రోజులు జైల్లో పెట్టినా మీ కడుపు మంట చల్లారలేదా చంద్రబాబూ? అని ఆయన ప్రశ్నించారు. నారా లోకేశ్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని అన్నారు. తనను అంతం చేయాలనే ఆలోచన లేకపోతే దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. తనకు ఏమైనా జరిగితే లోకేశ్ దే బాధ్యత అని అన్నారు. నీ రెడ్ బుక్ తీసి మడిచిపెట్టుకో అంటూ లోకేశ్ ను ఉద్దేశించి జోగి రమేశ్ అన్నారు.  

తప్పుడు కేసుతో తనను, తన తమ్ముడిని అక్రమంగా 83 రోజులు జైల్లో పెట్టారని జోగి రమేశ్ మండిపడ్డారు. మమ్మల్ని వేధించి రాక్షసానందం పొందుతున్నారా? అని ప్రశ్నించారు. ఒక కుట్ర ప్రకారమే తన ఇంటిపై దాడి జరిగిందని అన్నారు. మీరు బూతులు తిడితే తప్పులేదు కానీ... మేము ప్రశ్నిస్తే తప్పా? అని నిలదీశారు. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గూండాలను రప్పించారని ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగిందని అన్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణ కల్పించారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని అన్నారు. ఆ సమయంలో పోలీసుల చేతుల్లో లాఠీలు కూడా లేవని చెప్పారు. 

కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమయిందని చెప్పారు. తనకు అండగా జగనన్న, వైసీపీ సైన్యం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోనని చెప్పారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నానని... కేసులకు, అరెస్టులకు తాను భయపడేది లేదని అన్నారు. తన ఇల్లు తగలబెట్టి లోకేశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని కొందరు అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
Jogi Ramesh
Chandrababu Naidu
Nara Lokesh
YSRCP
Andhra Pradesh Politics
Kesineni Chinni
Political Attack
False Case
Ganja Batch
AP Government

More Telugu News