Sharif Usman Hadi: బంగ్లాదేశ్‌లో ఎన్నికల అభ్యర్థి మృతి.. దాడులు, దహనాలు.. పత్రికా కార్యాలయాలకు నిప్పు

Sharif Usman Hadi death sparks violence in Bangladesh
షార్ట్స్‌లో చూడండి
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద నేత, ఎన్నికల అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హదీ (32) మరణంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు భగ్గుమన్నాయి. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ప్రాచుర్యం పొందిన ఆయన మృతితో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో దాడులు, దహనాలకు పాల్పడ్డారు.

ఢాకాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా గత శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ వార్త తెలియగానే ఆయన అనుచరులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. రాజధాని ఢాకాలోని 'ది డైలీ స్టార్', 'ప్రోథోమ్ ఆలో' వంటి ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో సిబ్బంది లోపల చిక్కుకుపోయారు.

ఈ హింస ఢాకాకే పరిమితం కాలేదు. పోర్టు నగరమైన చిట్టగాంగ్‌లో భారత సహాయ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకారులు గుమిగూడి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజ్‌షాహీలో బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి, అవామీ లీగ్ కార్యాలయానికి నిరసనకారులు నిప్పుపెట్టారు.

2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, ఆమె భారత్‌కు వెళ్లినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఫిబ్రవరి 12న దేశంలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది.

హదీ మరణంపై స్పందించిన ప్రధాని మహమ్మద్ యూనస్, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి తీరని లోటని అన్నారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హింస ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. హదీకి నివాళిగా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది.
Go Back to Shorts
Sharif Usman Hadi
Bangladesh unrest
Anti-India protests
Dhaka violence
Chittagong protests
Sheikh Hasina
Mohammad Yunus
Bangladesh elections 2024
Newspaper office fire

More Telugu News