యువకుడి ఇంట్లో ఉరేసుకున్న వివాహిత!
- ఒంటరిగా తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం
- ఆలస్యం కావడంతో ఉరి బిగుసుకుని వివాహిత మృతి
- ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
- నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన
జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల వివాహితకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమెకు నాగోలులోని అంధుల కాలనీలో ఉండే బానోత్ అనిల్ నాయక్(24) తో పరిచయం ఉంది. ఈ క్రమంలో కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఈ నెల 20న అనిల్ వద్దకు వచ్చింది. 21న రాత్రి వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆ మహిళ బాత్రూంలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా ఆమె ఉరివేసుకోవడం కనిపించింది.
తలుపులు బద్దలు కొట్టి అనిల్ లోపలికి వెళ్లేలోపు ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో భయాందోళనలకు గురైన అనిల్.. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని తన చేతిని కోసుకున్నాడు. ఇంతలో ఆ మహిళ కుమారుడు ఏడుస్తూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసి నాగోలు చేరుకున్న మహిళ భర్త, బంధువులు.. అనిల్ ను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.