యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత.. భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలు
- 9 నెలల విరామం తర్వాత వడ్డీ రేట్లను తగ్గించిన యూఎస్ ఫెడ్
- కీలక ఫెడరల్ ఫండ్స్ రేటు పావు శాతం కోత
- 4.00 శాతం నుంచి 4.25 శాతం శ్రేణికి చేరిన వడ్డీ రేట్లు
- ఈ ఏడాది మరో రెండుసార్లు రేట్లు తగ్గొచ్చని సంకేతాలు
- ఫెడ్ నిర్ణయంతో గిఫ్ట్ నిఫ్టీ భారీ లాభాల్లోకి
- ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి రంగాలకు మేలు
ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశంలో ఈ నిర్ణయాన్ని 11-1 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదించారు. ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు ముందు నుంచి ఊహించినట్లుగానే ఫెడ్ ఈ కోత విధించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఉద్యోగాల కల్పన నెమ్మదించడం, ద్రవ్యోల్బణం ఇంకా కొంత అధిక స్థాయిలోనే కొనసాగుతుండటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. "ఆర్థిక దృక్పథంపై అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యంగా ఉపాధి కల్పన విషయంలో ప్రతికూలతలు పెరిగాయి" అని ఎఫ్ఓఎంసీ పేర్కొంది.
గతేడాది డిసెంబర్ లో చివరిసారిగా వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడ్, ఆ తర్వాత వరుసగా ఐదు సమావేశాల్లో యథాతథ స్థితిని కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ రేట్ల తగ్గింపు బాట పట్టడం మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని నింపింది. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని ఫెడ్ అధికారులు 'డాట్ ప్లాట్' ద్వారా సంకేతాలు ఇచ్చారు.
ఫెడ్ నిర్ణయంతో అమెరికా మార్కెట్లు కూడా లాభపడ్డాయి. డౌ జోన్స్ ఇండెక్స్ దాదాపు 1శాతం పెరగ్గా, నాస్డాక్ ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్గా ముగిసింది. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం భారత్లోని ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాలకు ప్రయోజనం చేకూర్చనుంది. డాలర్తో రూపాయి మారకం విలువపై కూడా ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.