కవితపై వ్యాఖ్యలు.. వి. ప్రకాశ్కు జాగృతి నేతల తీవ్ర హెచ్చరిక
- నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవంటూ వార్నింగ్
- హరీశ్ రావు ప్యాకేజీ తీసుకునే ప్రకాశ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపణ
- కాళేశ్వరం అవినీతిలో ప్రకాశ్కు కూడా వాటా ఉందని వ్యాఖ్యలు
జాగృతి కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా వి. ప్రకాశ్పై తీవ్రస్థాయిలో వారు విరుచుకుపడ్డారు. "ప్రకాశ్ ఒక మేధావి కాదు, మేత మేసే ఆవు" అంటూ ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నుంచి ప్యాకేజీ తీసుకుని కవితపై ప్రకాశ్ ఆరోపణలు చేస్తున్నారని, ఎంతకు అమ్ముడుపోయావని నిలదీశారు.
కాళేశ్వరం అవినీతి బండారం బయటపడితే తన పేరు కూడా వస్తుందనే భయంతోనే ప్రకాశ్, కవితను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టులో హరీశ్ రావు, మేఘా కృష్ణారెడ్డితో పాటు ప్రకాశ్కు కూడా వాటా ఉందని, అందుకే ఆయనలో ఆందోళన మొదలైందని అన్నారు. నీటి వనరుల సంస్థ ఛైర్మన్గా ఆయన వాటా ఎంత అని ప్రశ్నించారు.
గతంలోనూ వి. ప్రకాశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని జాగృతి నేతలు ఆరోపించారు. అభ్యుదయవాది మారోజు వీరన్న హత్యలో ఆయన పాత్ర ఉందని, చంద్రబాబుతో కుమ్మక్కై నిధులు కాజేశారని విమర్శించారు. అంతేకాకుండా, దేవేందర్ గౌడ్, కపిలవాయి దిలీప్లతో కొత్త పార్టీలు పెట్టించి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారని మండిపడ్డారు.
సొంత చెల్లెలిపై ఇలాంటి ఆరోపణలు వస్తుంటే కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని జాగృతి నేతలు ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన మౌనం బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.