మార్కెట్ల లాభాల జోరు.. వరుసగా నాలుగో రోజు పరుగులు!
- 84 వేల మార్కును దాటిన సెన్సెక్స్
- 303 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 88 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ట్రేడింగ్ వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం సెన్సెక్స్ 83,774 పాయింట్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ప్రారంభమైంది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, కొద్దిసేపటికే పుంజుకుని లాభాల బాట పట్టింది. రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 84,089పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు, క్రితం ముగింపుతో పోలిస్తే 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 88 పాయింట్లు పెరిగి 25,637 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అయితే ట్రెంట్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.48 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 68.32 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు ధర 3,300 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.