ఇదేం వెర్రి కామెడీ?... వీసీ సజ్జనార్ ఆగ్రహం
- సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఆర్టీసీ సిబ్బందితో అభ్యంతరకర ప్రవర్తన
- కామెడీ పేరుతో సిబ్బంది విధులకు ఆటంకంపై టీజీఎస్ఆర్టీసీ ఆగ్రహం
- నిబద్ధతగల ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని వీసీ సజ్జనార్ హితవు
- ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
కొంతకాలంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తక్షణ గుర్తింపు కోసం ఆర్టీసీని, దాని సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. "సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎలాంటి పిచ్చివేషాలైనా వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా?" అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించబోదని సజ్జనార్ స్పష్టం చేశారు. "ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.