డైటింగ్ పేరుతో మూడు నెలలు ఆహారం మానేసిన యువతి మృతి

Kerala girl weighing hardly 24 kg dies of extreme dieting
  • కేరళలోని కన్నూరులో విషాదం
  • సూటిపోటి మాటలు భరించలేక బరువు తగ్గే యత్నం
  • కఠిన ఆహార నియమాలు పాటించడంతో అనారోగ్యం పాలైన యువతి
  • చికిత్స పొందుతూ మృతి
ఆమె వయసు 18 సంవత్సరాలు. లావుగా ఉండటంతో చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. అవి ఆ యువతిని మానసిక వేదనకు గురిచేశాయి. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కఠిన ఆహార నియమాలను పాటించింది. ఈ క్రమంలో మూడు నెలల పాటు ఆహారం తీసుకోవడం మానేయడంతో అనారోగ్యం పాలై మృత్యువాత పడింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిందీ ఘటన.

కూథుపరంబంకు చెందిన శ్రీనంద బరువు ఎక్కువగా ఉండటంతో తగ్గేందుకు యూట్యూబ్‌లో ఇచ్చే సలహాలు పాటించింది. మూడు నెలలపాటు ఆహారం తీసుకోవడం మానేసింది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు నిర్ఘాంతపోయారు. బీపీ 70కి, ఆక్సిజన్ స్థాయులు 70-72కి పడిపోయాయి. సోడియం, పొటాషియం స్థాయులు మరీ తక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తక్షణం ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఆహార నియమాలు పాటించకముందు 50 కేజీలున్న శ్రీనంద ఆసుపత్రికి వచ్చేసరికి 25 కేజీల్లోపే ఉన్నట్టు గుర్తించారు. ఆరు నెలల నుంచి బరువు తగ్గేందుకు శ్రీనంద ప్రయత్నిస్తున్నట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. మొదట ఆహారం తీసుకోవడాన్ని తగ్గించిందని, మూడు నెలల నుంచి పూర్తిగా తీసుకోవడం మానేసిందని వారు చెప్పినట్టు వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Kerala Girl
Dieting
Anorexia Nervosa
Health

More Telugu News