శ్రీశైలంలో అన్యమతస్తులకు దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

supreme court rules on allocating shops to other religions in srisailam
  • అన్యమతస్థులకు దేవాలయాల్లో షాపులు కేటాయించవద్దని గతంలో జీవో 426 విడుదల చేసిన ప్రభుత్వం
  • ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 426ని సమర్ధిస్తూ 2019లో హైకోర్టు ఉత్తర్వులు
  • హైకోర్టు ఉత్తర్వులపై 2020లో స్టే విధించిన సుప్రీం కోర్టు
  • స్టే కొనసాగుతుందని, జీవో 426 అమలు చేయవద్దని తాజాగా ఆదేశాలు  
హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోకి వచ్చే ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల నిర్వహణకు పిలిచే టెండర్లలో హిందూయేతరులు పాల్గొనకూడదని పేర్కొంటూ 2015లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆ జీవో ఆధారంగా మళ్లీ టెండర్లు పిలవడంతో పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారులు తప్పు తెలుసుకొని టెండర్లను ముందే ఉపసంహరించుకున్నారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర అధికారులు పదే పదే ఇలాంటి టెండర్లు జారీ చేస్తున్నారని, మూడో సారి ఇలాంటి పొరపాటు చేసినందున భవిష్యత్తులో ఇలా జరగకుండా స్పష్టత నివ్వాలని కోరారు. దీంతో 2020 ఫిబ్రవరి 27న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అది కొనసాగుతుందని, జీవో 426 అమలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.   
Go Back to Shorts
Supreme Court
Srisailam Temple
Allocating Shops

More Telugu News