చాహల్ తో విడాకుల వార్తలపై స్పందించిన ధనశ్రీ
- మానసిక వేదనకు గురవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారంటూ ఆవేదన
- 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన చాహల్ - ధనశ్రీ
ఇటీవల మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ధనశ్రీ వాపోయారు. తాను, తన కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, అలాంటిది తనపై ద్వేషం కలిగేలా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని బాధపడ్డారు.
తన మౌనానికి అర్థం బలహీనత కాదని చెప్పారు. ఎన్నటికైనా నిజం గెలుస్తుంది, దానిని సమర్థించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ప్రస్తుత పరిస్థితిలో వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని విలువలతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు ధనశ్రీ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, 2020 డిసెంబర్ లో చాహల్, ధనశ్రీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు.