ap government: ఏపీ వక్ఫ్ బోర్డు రద్దు .. ఆదేశాలు జారీ చేసిన సర్కార్

ap government issued orders on canceling waqf board
షార్ట్స్‌లో చూడండి
ఏపీ వక్ఫ్ బోర్డు విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో-75 జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన, వివాదాస్పదమైన జీవోను రద్దు చేస్తూ నూతనంగా జీవో నెంబర్ 75 ను జారీ చేసిందని మంత్రి  ఫరూక్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే  ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
Go Back to Shorts
ap government
waqf board
N. Md. Farooq

More Telugu News