పొంగులేటి శ్రీనివాస రెడ్డికి 'బాంబుల శాఖ' అని పెట్టండి: కేటీఆర్

Former KTR satiers on Minister Ponguleti Srinivasa Reddy
  • ఈ బాంబు పేలుతుంది... ఆ బాంబు పేలుతుందంటున్నారని కేటీఆర్ ఎద్దేవా
  • కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తామన్న మాజీ మంత్రి
  • ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో ప్రజలకు వివరిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖ ఏదో నాకు తెలియదు. కానీ ఆయనకు 'బాంబుల శాఖ' అని పెట్టండి. ఎందుకంటే ఈ బాంబు పేలుతుంది... ఆ బాంబు పేలుతుందని అన్నారు. మరి ఏ బాంబు పేలి కాంగ్రెస్‌లో ఎవరు ఎగిరిపోతారో ఆయనకే ఎరుక. మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా. వాళ్లని మాత్రం వదిలిపెట్టం. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతుంది. వారోత్సవాలు, విజయోత్సవాలు చేయాలట. వీళ్లేదో పీకి పందిరేశారట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు. అవసరమైతే మేము కూడా పార్టీలో చర్చించి వీళ్ల పరిపాలనా వైఫల్యాల వారోత్సవం చేస్తాం, ప్రకటిస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో మేము చెబుతాం. పాదయాత్రలు, మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి’’ అని కేటీఆర్ చెప్పారు. 

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఏ కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనేది పేర్కొనలేదు.
Go Back to Shorts
KTR
Ponguleti Srinivas Reddy
BRS
Congress
Telangana

More Telugu News