Advertisement

దసరా లోపు 11 వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తాం: రేవంత్ రెడ్డి

Telangana will appoint 11062 teachers by Dasara
  • బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని విమర్శ
  • కాంగ్రెస్ 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని వెల్లడి
  • తక్కువ సమయంలో డీఎస్సీ ఫలితాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి
దసరా లోపు కొత్త ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఈరోజు ఆయన డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత సీఎం మాట్లాడుతూ... దసరా నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక ఉత్తర్వులు అందిస్తామన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత పదేళ్ల కాలంలో 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందన్నారు. నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించామన్నారు.

తమ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. తక్కువ సమయంలోని డీఎస్సీ ఫలితాలు ఇచ్చామని, పరీక్షల నిర్వహణ నుంచి నియామకాల వరకు... 65 రోజుల్లో 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 

పేదలకు కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలనేది తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. త్వరలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే లక్ష్యంలో భాగంగా మొదటి ఏడాదే 60,000 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. 

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్ష నిర్వహించగా 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దరఖాస్తుదారుల్లో 87.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు (6,508 పోస్టులు) గరిష్ఠంగా 88,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, 727 మంది భాషా పండితులు, 182 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ నియామకాల కోసం పరీక్ష నిర్వహించారు.
Advertisement
Revanth Reddy
Congress
DSC

More Telugu News