PM Modi: అమెరికాకు ప‌య‌న‌మైన ప్ర‌ధాని మోదీ

PM Modi departs for US to attend Quad Summit and address UNGA
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అలాగే పలు ద్వైపాక్షిక సమావేశాల‌తో పాటు అక్క‌డి భార‌తీయ ప్ర‌వాసుల‌తో కూడా భేటీ కానున్నారు. 

ఈ పర్యటనకు బ‌య‌ల్దేర‌డానికి ముందు ప్రధాని మోదీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ''ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావాలి. అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను. ఈ క్రమంలో మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నాను. 

క్వాడ్ సమ్మిట్‌లో నా సహాచరులు అధ్య‌క్ష‌డు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాతో క్వాడ్ సమ్మిట్‌లో కలుస్తాను. శాంతి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పురోగతి, శ్రేయస్సు కోసం క్వాడ్ ప‌ని చేస్తుంది. ఇక ప్రెసిడెంట్ బైడెన్‌తో సమావేశం భార‌త‌ ప్రజల ప్రయోజనం, ప్రపంచ ప్రయోజనాల కోసం కొత్త మార్గాలను సమీక్షించడానికి, గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. 

అలాగే భారతీయ డయాస్పోరా, ప్ర‌ముఖ‌ అమెరికన్ వ్యాపార నాయకులతో పరస్పర చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక 'ది సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' మానవాళి అభివృద్ధికి ప్రపంచ సమాజానికి ఒక అవకాశం" అని ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

మోదీ 3 రోజుల యూఎస్ ప‌ర్య‌ట‌న ఇలా..

ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు. ఈ మూడు రోజుల పాటు ప్రధాని క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌తో పాటు అనేక కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. సెప్టెంబర్ 21న డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగే ఆరో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ఆయన హాజరవుతారు. 

ఆ తర్వాత సెప్టెంబర్ 22న న్యూజెర్సీలో భారతీయ సమాజానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధాని మోదీ తన పర్యటన చివరి రోజైన సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో కూడా పాల్గొంటారు.
Go Back to Shorts
PM Modi
Quad Summit
UNGA
USA

More Telugu News