మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై మంత్రి తానాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Sitting next to Ajit Pawar makes me vomit says minister Tanaji Sawant
  • ఆయన పక్కన కూర్చుంటేనే తనకు వికారంగా అనిపిస్తుందన్న తానాజీ
  • తన జీవితంలో ఎన్‌సీపీని అంగీకరించబోనని స్పష్టీకరణ
  • కూటమి ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతం
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్టుగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్‌పై మంత్రి తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పక్కన కూర్చుంటేనే తనకు వికారంగా వాంతులు అవుతున్నట్టు అనిపిస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను బతికుండగా ఎన్‌సీపీని అంగీకరించబోనన్న ఆయన.. వారి (ఎన్‌సీపీ నేతలు)తో కూర్చుంటేనే తనకు వికారంగా ఉంటుందని, వాంతులు అవుతాయని పేర్కొన్నారు. 

ఓ కార్యక్రమంలో తానాజీ మాట్లాడుతూ.. తాను శివ సైనికుడినని పేర్కొన్నారు. తమ జీవితాలు కాంగ్రెస్, ఎన్‌సీపీతో ఎప్పుడూ కలిసిపోలేదన్నది నిజమని స్పష్టం చేశారు. వారి ఉనికే తనకు వికారంగా ఉంటుందని, అసౌకర్యంగా ఉంటుందని వివరించారు. వారితో కలిసి కేబినెట్‌లో కూర్చున్నా బయట అడుగుపెట్టగానే వికారంగా అనిపించేదని, 60 ఏళ్ల వయసులోనూ దానిని మార్చలేమని, తమ సూత్రాలకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు కూటమిలో నెలకొన్న విభేదాలను బహిర్గతం చేస్తున్నాయని చెబుతున్నారు.

తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ధారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లాలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేయాలంటూ ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఆయన ఒత్తిడి చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. 2022లో రత్నగిరి జిల్లాలోని తివారే డ్యామ్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది మరణించడానికి డ్యామ్ గోడలను పీతలు బలహీనపరచడమే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆనకట్ట ప్రమాదాన్ని కూడా ప్రకృతి విపత్తుగా అభివర్ణించారు.
Go Back to Shorts
Ajit Pawar
Tanaji Sawant
NCP
Eknath Shinde

More Telugu News