30 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే!

MrBeast Becomes First YouTuber To Reach 300 Million Subscribers
  • ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్
  • తన వీడియోల్లో వివిధ రకాల ఛాలెంజ్‌లు, ఖరీదైన బహుమతుల ప్రదానంతో అశేష జనాదరణ
  • ఇటీవలే టీసిరీస్‌ను అధిగమిస్తూ అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా రికార్డు
  • భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొంటానంటూ ప్రకటన
యూట్యూబ్ ప్రేక్షకులకు మిస్టర్ బీస్ట్‌గా సుపరిచితమైన జిమ్మీ డొనాల్డ్‌సన్ చరిత్ర సృష్టించాడు. 30 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన తొలి యూట్యూబర్‌గా అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. ఖరీదైన స్టంట్లు, సవాళ్లలతో వ్యూవర్లను విశేషంగా ఆకట్టుకునే మిస్టర్ బీస్ట్ గత నెలలోనే ప్రముఖ భారతీయ యూట్యూబ్ ఛానల్ టీసిరీస్‌ను అధిగమిస్తూ అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా 30 కోట్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని చేరుకొని అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. దీనిపై ఎక్స్ వేదికగా మిస్టర్ బీస్ట్ హర్షం వ్యక్తం చేశాడు. 

‘‘11 ఏళ్ల క్రితం 300 మంది సబ్‌స్క్రైబర్లను చేరుకున్నప్పుడు సంబరంతో ఎగసిపడటం నాకిప్పటికీ గుర్తుంది’’ అంటూ యూట్యూబ్ ఛానల్ తొలి రోజులను గుర్తు చేసుకున్నాడు. దీనిపై అతడి ఫాలోవర్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘ప్రపంచ జనాభాలో 3.5 శాతం మంది ఇప్పుడు నీ ఫాలోవర్లుగా ఉన్నారు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 

అత్యంత ఆధునిక ప్రొడక్షన్ విలువలతో కూడిన వేగవంతమైన ఎడిటెడ్ వీడియోలకు అతడి ఛానల్ ప్రసిద్ధి. రకరకాల ఛాలెంజ్‌లు, గెలుపొందిన వారికి అత్యంత ఖరీదైన బహుమతులు ఇస్తూ మిస్టర్ బీస్ట్ వీడియోలు చేస్తుంటాడు. తన దాతృత్వంతో అతడు అశేష అభిమానాన్ని పొందాడు. 2 కోట్ల మొక్కలు నాటడంతో పాటు పలు ఇతర దాతృత్వ ప్రాజెక్టులు, బిజినెస్ వెంచర్లు నిర్వహిస్తుంటాడు. 2012 నుంచి అతడు యూబ్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ 2018లో చేసిన ఓ వీడియో బీస్ట్ పాప్యులారిటీని అమాంతం పెంచేసింది. గుర్తింపునకు నోచుకోని ట్విచ్ స్ట్రీమర్లకు, యూట్యూబర్లకు వేల కొద్దీ డబ్బు ఇస్తూ చేసిన వీడియో అతడి ఉనికిని ప్రపంచానికి చాటింది. నాటి నుంచీ బీస్ట్ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది. 

యూట్యూబ్ తెచ్చిన పాప్యులారిటీతో అతడు మరింత ఉన్నత లక్ష్యాలు ప్రకటించి సంచలనం సృష్టించాడు. తనకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన ఉందని ప్రకటించడం పెను కలకలానికి దారి తీసింది. తాను అధ్యక్షుడినైతే పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. తనకు తెలియని అంశాలపై నిర్ణయాల కోసం నిపుణుల సలహాలు తీసుకుంటానని చెప్పాడు. ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తాన్ననాడు. దేశంలో చీలికలు సృష్టించేబదులు ప్రజలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని అన్నాడు. అయితే, 15 ఏళ్ల తరువాత తనకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అర్హత వచ్చాక మరిన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నాడు.
Go Back to Shorts
MrBeast
Youtube Channel
Highest Subscribers

More Telugu News