హిండెన్ బర్గ్ కు సెబీ షోకాజ్ నోటీసులు

SEBI Issues Show Cause Notice To Hindenburg Nathan Anderson Over Adani Report
  • తమ చట్ట నిబంధనలను ఉల్లంఘించారని ఆక్షేపణ
  • తప్పుడు ప్రకటనతో భారత్ లోని లిస్టెడ్ కంపెనీల సెక్యూరిటీల విలువ మదించారని మండిపాటు
  • నోటీసులపై స్పందించిన హిండెన్ బర్గ్.. నోటీసులిచ్చే అధికార పరిధి సెబీకి లేదని వెల్లడి
  • కోటక్ మహీంద్ర బ్యాంకు పేరు ప్రస్తావన.. దాదాపు 2 శాతం పతనమైన ఆ సంస్థ షేర్లు
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ గతేడాది ఓ నివేదికను విడుదల చేసిన అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ పేరు గుర్తుందా? షేర్ల విలువను కృత్రిమంగా పెంచుతున్నారంటూ ఆ సంస్థ ఇచ్చిన నివేదిక దెబ్బకు ఓ దశలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 12 లక్షల కోట్లు పతనం కావడం తెలిసిందే. అయితే తాజాగా హిండెన్ బర్గ్ తోపాటు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్, మారిషస్ కు చెందిన విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ మార్క్ కింగ్ డన్ కు చెందిన సంస్థలకు భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తమ చట్ట నిబంధనలను హిండెన్ బర్గ్, ఆండర్సన్, కింగ్ డన్ ఉల్లంఘించారని సెబీ ఆ నోటీసుల్లో పేర్కొంది. భారత్ వెలుపల ట్రేడింగ్ అయ్యే సెక్యూరిటీల విలువను అంచనా వేసేందుకే ఈ నివేదిక విడుదల చేసినట్లు తప్పుడు ప్రకటన చేశారని సెబీ తెలిపింది. కానీ వాస్తవానికి భారత్ లో లిస్టయిన కంపెనీలకు చెందిన సెక్యూరిటీల విలువను మదిస్తూ ఈ నివేదిక రూపొందించారని గుర్తుచేసింది.

అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ల లావాదేవీల్లో హిండెన్ బర్గ్ పరోక్షంగా పాల్గొనేలా కింగ్ డన్ సాయం చేశారని సెబీ ఆరోపించింది. భారతీయ డెరివేటివ్స్ మార్కెట్ లోకి ప్రవేశించి అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఫ్యూచర్స్ మార్కెట్ పై లావాదేవీలు నిర్వహించేలా ఆ షార్ట్ సెల్లర్ సంస్థతో కింగ్ డన్ కుమ్మక్కయ్యారని దుయ్యబట్టింది. ఇలా ఆర్జించిన లాభాలను ఆ పరిశోధన సంస్థతో ఆయన పంచుకున్నారని పేర్కొంది.

ఈ నేపథ్యంలో సెబీ నోటీసులపై హిండెన్ బర్గ్ స్పందించింది. తమ సంస్థకు నోటీసులు జారీ చేసే అధికార పరిధి సెబీకి లేదని స్పష్టం చేసింది. భారత్ లో అదానీ సంస్థకు చెందిన షేర్ల కొనుగోళ్ల కార్యకలాపాలు సాగించేందుకు దోహదపడిన కోటక్ మహీంద్ర బ్యాంక్ పేరును షోకాజ్ నోటీసులో ప్రస్తావించడంలో సెబీ విఫలమైందని విమర్శించింది. భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ లేదా ఆ సంస్థ బోర్డు సభ్యుల పేర్లను ఈ తనిఖీల నుంచి కాపాడేందుకే సెబీ షోకాజ్ నోటీసులో ప్రస్తావించలేదని తాము అనుమానిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు అదానీ–హిండెన్ బర్గ్ వ్యవహారంలో అనూహ్యంగా కోటక్ మహీంద్ర బ్యాంకు ప్రస్తావన తెరపైకి రావడంతో మంగళవారం ఆ సంస్థ షేర్లు దాదాపు 2 శాతం పతనమయ్యాయి.
Go Back to Shorts
SEBI
Hindenburg LLC
Show Cause Notice
Issued

More Telugu News