Telangana: తెలంగాణ‌లోని ఆ రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్‌

100 Percent Polling in Two Villages of Telangana
  • ప్ర‌జాస్వామ్య విలువ‌ను చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు
  • జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌
  • అలాగే మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలోనూ ఓటర్ల‌ చైతన్యం

తెలంగాణ‌లోని ఆ రెండు గ్రామాలు ప్ర‌జాస్వామ్య విలువ‌ను చాటి చెప్పాయి. అక్క‌డి ఓట‌ర్లు ఓటుతో త‌మ చైతన్యాన్ని చాటారు. లోక్‌సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్‌ ఆఫీసర్ శ‌క్రు నాయక్‌, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్‌ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ప్ర‌త్యేకంగా అభినందించారు.

అలాగే మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన‌ 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా.. అంద‌రూ ఓటు వేశారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ట్లు పోలింగ్ సిబ్బంది వెల్ల‌డించారు. దీంతో సంగాయిపేట తండా వాసుల‌ను మెద‌క్ క‌లెక్ట‌ర్ అభినందించారు. 

ఇదిలాఉంటే.. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదయిన‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. గ్రామీణ తెలంగాణలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతం దాట‌డం విశేషం.

  • Loading...

More Telugu News