మేం వస్తూనే రూ.4 వేలు పెన్షన్ ఇస్తాం... జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట!: చంద్రబాబు

Chandrababu assures Rs4000 pension
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో మేనిఫెస్టో హామీలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట అని వెల్లడించారు. ఇప్పుడు చెప్పండి... పేదల పెన్నిధి ఎవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు. 

ఏపీలో సచివాలయాలు, పంచాయతీల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారు ఒక్కొక్కరు 40 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి వృద్ధులను చంపేసే పరిస్థితికి వచ్చాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటి దగ్గర ఇవ్వకుండా, వృద్ధులను సచివాలయాలకు తిప్పి, అక్కడా ఇవ్వకుండా పండుటాకుల వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం ఇది, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఈ నెల పెన్షన్లపైనా తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ ఈ దుర్మార్గుడు ఇంటివద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడు... బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయడం ముసలివాళ్లకు తెలుసా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

"ఐఏఎస్ చదువుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతున్నా... ముసలివాళ్లు ఐదు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లగలరా? బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబరు కావాలి... పాపం ఆ ముసలివాళ్లు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతెలియకుండా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా... మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. రూ.4 వేల పెన్షన్ ఇస్తా... 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని, సీఎస్ ను హెచ్చరిస్తున్నా... ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులు పడే క్షోభ నేను చూశాను... వారి ఉసురు మీకు తగులుతుంది" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Chandrababu
Pensions
TDP
Jagan
YSRCP
Markapur
Prakasam District

More Telugu News