Jagga Reddy: గెలిపిస్తే ప్రజల కోసం పని చేస్తా... ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటా: జగ్గారెడ్డి
తనను గెలిపిస్తే ప్రజల కోసం పని చేస్తానని... ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓడిపోయిన సంగతి విదితమే. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమయం కలిసిరాక తాను సంగారెడ్డిలో ఓడిపోయానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు తనకు అయిదేళ్లు విశ్రాంతి ఇచ్చారని... అందుకు వారికి కృతజ్ఞతలు అన్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధిష్ఠానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారికి మద్దతు ఉంటుందన్నారు.