Satya Kumar: 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్
మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు మంగళగిరి పీఎస్ కు తరలించారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఏబీవీపీ కార్యకర్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యలపై ఎలుగెత్తిన విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసగించారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిద్ధం అంటూ ప్రకటనలు ఇచ్చుకుంటున్న జగన్ ను సాగనంపేందుకు ప్రజలు కూడా సిద్ధం అంటున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.