BRS Ex MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు

BRS Ex MLA Kandala Upender Reddy is booked for encroaching govt land in Banjara Hills
  • బంజారాహిల్స్ లో భూమిని కబ్జా చేశారని కందాల ఉపేందర్ రెడ్డిపై ఫిర్యాదు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన షేక్ పేట తహసీల్దార్
  • పాలేరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని విలువైన భూమిని ఆయన కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు పెట్టారు. షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్‌ నం.3లోని సర్వే నెంబర్ 8 లో 2.25 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇందులో చాలా భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడగా 2,185 చ.మీ. (ప్లాట్ నెంబర్ 8-సి) ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇదే సర్వే నెంబర్ లో (8-డి) షౌకతున్నీసా పేరుతో ఉన్న భూమిని ఉపేందర్ రెడ్డి గతంలోనే కొనుగోలు చేశారు.

దీంతోపాటు పక్కనే ఖాళీగా ఉన్న 2,185 చ.మీ. స్థలం కూడా తనదేనని ఆయన వాదిస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి గతంలో ఒకసారి ఉపేందర్ రెడ్డి ప్రయత్నించగా.. తహసీల్దార్ అడ్డుకున్నారు. ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లోకి చేర్చారు. దీనిపై ఉపేందర్ రెడ్డికి చెందిన ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ కోర్టును ఆశ్రయించగా.. యథాతథస్థితిని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఉపేందర్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి షెడ్లు నిర్మించి, వైన్ షాపు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ అనితారెడ్డి అక్కడి నిర్మాణాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్‌ చేశారు. భూకబ్జాపై అనితారెడ్డి ఫిర్యాదు చేయగా.. ఉపేందర్‌రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
BRS Ex MLA
Kandala Upender Reddy
govt land
Banjara Hills
Sheikpet
Police case

More Telugu News