టెట్ పరీక్ష కేంద్రంలో కుప్పకూలిన 8 నెలల గర్భిణి.. సంగారెడ్డిలో విషాదం
- ఆలస్యం అవుతోందని పరిగెత్తుకుంటూ వెళ్లిన మహిళ
- బీపీ పెరిగి ఎగ్జామ్ హాల్ లో పడిపోయిన గర్భిణి
- ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే చనిపోయిందన్న వైద్యులు
శుక్రవారం టెట్ పరీక్ష సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ పరీక్ష రాసేందుకు ఇస్నాపురంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి రాధిక అనే ఎనిమిది నెలల గర్భిణి వచ్చింది. ఆలస్యం అవుతోందనే హడావుడిలో కేంద్రంలోని తన గదికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. దీంతో బీపీ పెరిగి హాలుకు చేరుకున్న కాసేపటికి కుప్పకూలింది. ఇన్విజిలేటర్ గమనించి అధికారులకు సమాచారం ఇవ్వగా.. కేంద్రం బయట వెయిట్ చేస్తున్న రాధిక భర్త అరుణ్ అక్కడికి చేరుకున్నాడు. సిబ్బంది సాయంతో రాధికను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాధిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో అరుణ్ కన్నీటిపర్యంతమయ్యాడు. రాత్రింబవళ్లు చదివి, పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయని విలపించాడు.