Gorantla Madhav: చంద్రబాబుకు అందరి మాదిరే జైలు భోజనం పెట్టాలి: ఎంపీ గోరంట్ల మాధవ్

Chandrababu should be given jail food like everyone else says Gorantla Madhav
  • చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదన్న గోరంట్ల మాధవ్
  • జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించాలని డిమాండ్
  • చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఉద్దేశించి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలను కల్పించకూడదని, సాధారణ ఖైదీలు తినే ఆహారాన్నే ఆయనకు పెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక భోజనం పెడితే ఇతర ఖైదీలు కూడా ఇంటి భోజనమే తింటామని డిమాండ్ చేస్తారని చెప్పారు. 

రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని కేసుల్లో అరెస్ట్ అవుతారని గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయనకు తక్షణమే జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాపం పండిందని, ఆయనను భగవంతుడు కూడా కాపాడలేరని అన్నారు. చట్టం ప్రకారమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజల్లో స్పందనే లేదని ఎద్దేవా చేశారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించి ఉంటుందని చెప్పారు.
Gorantla Madhav
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News