Yarapathineni Srinivasa Rao: మేము ఎవరినీ పొట్టన పెట్టుకోలేదు: యరపతినేని

Yarapathineni comments on Jagan
షార్ట్స్‌లో చూడండి
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన యువగళం పాదయాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టమని... గురజాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్ అన్నట్టు మా నారా లోకేశ్ కి ప్రజలు స్వాగతం పలికారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అలియాస్ క్యాష్ మహేశ్ రెడ్డి ... నారా సారా అని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. కాసు మహేశ్ ఒకటి గుర్తుంచుకోవాలని... సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బ్రాండెడ్ లిక్కర్ తీసేసి రూ. 5 చీప్ లిక్కర్ అమ్ముతూ నెలకు రూ. 1000 కోట్లు సంపాదిస్తున్నాడని అన్నారు. నాసిరకం మద్యంతో 60 వేల మంది ప్రాణాలను తీశాడని విమర్శించారు. 

గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మడం ద్వారా రోజూ ఎమ్మెల్యేకి రూ. కోటి అందుతోందని యరపతినేని ఆరోపించారు. తాడేపల్లిలో ఉండే సైకోగాడు, గురజాలలో ఉండే సైకోగాడిలా మేము ఎవరి పొట్ట కొట్టలేదని అన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు గారి ఇల్లు సారా డబ్బుతో కట్టారని విమర్శిస్తున్నారని... ఆయన ఇల్లు ఎప్పుడు కట్టారో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. సారాతో ఇల్లు కట్టుకోవాల్సిన ఖర్మ చంద్రబాబుకు లేదని చెప్పారు. 

చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేసులు పెట్టిన తీరును బట్టే జగన్ రెడ్డి పని అయిపోయిందని అర్ధమవుతోందని చెప్పారు. సైకో ప్రవర్తన వల్ల రాష్ట్రంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. పుంగనూరులో మీరే రెచ్చగొట్టి, మీరే దాడులు చేసి మాపై కేసులా? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుపై పెట్టిన కేసులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. పెద్దిరెడ్డితో కలిసి జగన్ కుట్ర ప్రకారమే చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారని అన్నారు. రాళ్ల దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెడతారా? దమ్ముంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయండి చూద్దామని సవాల్ విసిరారు. 

టీడీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... తాను బెయిల్ పై ఉన్న ముద్దాయి కాబట్టి, అందర్నీ జైలుకు పంపాలని జగన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. దేశంలో అత్యంత ధనికుడిని కావాలని... ఏపీలోని నేతలందర్నీ జైలుకు పంపాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నాడని అన్నారు. ప్రాజెక్టులు సందర్శించేందుకు వెళ్లిన చంద్రబాబుపై కేసులు పెట్టడం జగన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని... డీజీపీ ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Yarapathineni Srinivasa Rao
Prathipati Pulla Rao
GV Anjaneyulu
Kanna Lakshminarayana

More Telugu News