సుఖేష్ తనపై చేసిన సంచలన ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్
- కవితకు వ్యతిరేకంగా వున్న ఆధారాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ గవర్నర్ కు సుఖేష్ లేఖ
- అతని గురించి తనకు తెలియదన్న మంత్రి కేటీఆర్
- న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ట్వీట్
కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకొని, ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని సుఖేష్ సదరు లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. సుఖేష్ తనపై ఆరోపణలు చేసినట్లుగా మీడియా ద్వారా ఇప్పుడే తెలిసిందన్నాడు.
ఇలాంటి మోసగాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతనెవరో తనకు తెలియదన్నారు. తనపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్న ఈ మోసగాడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇలాంటి క్రిమినల్స్ ఆరోపణలు చేసినప్పుడు ప్రచారం చేసేటప్పుడు, ప్రచురించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మీడియాకు సూచించారు. కాగా, కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ లపై ఆరోపణలు చేస్తూ చాలా సార్లు సుఖేష్ లేఖలు రాశారు. తాజాగా కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడంతో సంచలనంగా మారింది.