Telangana: నేడు, రేపు ఎండలే..వాతావరణ శాఖ అలర్ట్

  • మంగళ, బుధవారాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
  • హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఛాన్స్
  • వాతావరణ శాఖ హెచ్చరిక
  • సూర్యాపేటలో సోమవారం వడదెబ్బకు ఇద్దరు వృద్ధుల మృతి
Telangana to see high temperatures today and tomorrow

తెలంగాణలో నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

సోమవారం రాష్ట్రంలో ఎండలు సెగలుకక్కాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.

More Telugu News