YS Avinash Reddy: సుప్రీంకోర్టులో వైఎస్ అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

  • సుప్రీం వెకేషన్ బెంచ్ లో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • టీఎస్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచన
  • అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని సుప్రీం స్పష్టీకరణ
Supreme Court not granted bail to YS Avinash Reddy

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. ఈ నెల 25న అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అవినాశ్ కు సూచించింది. అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది. 

మరోవైపు విచారణ సందర్భంగా... సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించడంతో... ఇప్పుడు సీబీఐ అధికారలు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు, సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం.

More Telugu News