Virat Kohli: కోహ్లీ, గిల్ సెంచరీలు కొడితే.. కేవలం గిల్ ను మాత్రమే పొగిడిన గంగూలీ!

  • నిన్నటి బెంగళూరు, గుజరాత్ మ్యాచ్ లో చెలరేగి ఆడిన కోహ్లీ, గిల్
  • గిల్ ను పొడుతూ గంగూలీ ట్వీట్.. ఎక్కడా కోహ్లీ ఊసెత్తని మాజీ కెప్టెన్
  • ఈ ఐపీఎల్ సీజన్ లో దుమారం రేపిన ‘నో షేక్ హ్యాండ్’ వివాదం
sourav ganguly in his tweet extols shubman gill for his century but not mentioned kohli

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ, స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మ‌ధ్య వైరం ముగిసిన‌ట్లు లేదు. గంగూలీ చేసిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. నిన్న బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో.. కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు సెంచరీలు చేశారు. కానీ గంగూలీ.. గిల్ ను మాత్రమే పొగుడుతూ గంగూలీ ట్వీట్ చేశాడు.  

‘‘ఈ దేశం అద్భుత‌మైన ట్యాలెంట్‌ను తయారు చేస్తోంది. శుభ్‌మన్ గిల్.. వావ్.. రెండు హాఫ్స్‌లోనూ స్టన్నింగ్ ఇన్నింగ్స్ న‌మోదు అయ్యాయి. ఐపీఎల్ టోర్న‌మెంట్ ప్ర‌మాణాలు అసాధార‌ణంగా ఉన్నాయి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కానీ కోహ్లీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘నువ్వు ప్రస్తావించకున్నా కోహ్లీనే కింగ్’ అని కామెంట్లు చేస్తున్నారు.

బీసీసీఐ అధ్య‌క్షుడిగా గంగూలీ, టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఐపీఎల్ లో తారస్థాయికి చేరాయి. ఢిల్లీ, ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన స‌మ‌యంలో గంగూలీ, కోహ్లీలు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు.

దీంతో ‘నో షేక్ హ్యాండ్’ వివాదం దుమారం రేపింది. మరో సమయంలో తన ఎదురుగా వెళ్తున్న గంగూలీ వైపు సీరియస్ గా కోహ్లీ చూస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తర్వాత జరిగిన మ్యాచ్ లో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా.. తాజా ట్వీట్ ను బట్టి చూస్తే గొడవ సమసిపోలేదని తెలుస్తోంది.

More Telugu News