రూ. 10 వేలు కడితే రూ. 10 లక్షలు ఇస్తామంటూ పాస్టర్లకు టోకరా

Christians and Pastors duped in telugu states
  • గుడ్‌షెపర్డ్, ఆర్ఆర్ ఫౌండేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు
  • పాస్టర్లు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న నిందితులు
  • రూ. 10 వేలు కడితే రూ. 10 లక్షలు ఇస్తామంటూ బురిడీ
  • రూ. 5 లక్షలు కడితే తమిళనాడులో 5 సెంట్ల భూమి ఇస్తామంటూ మోసం
క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకుని ఆపై బోర్డు తిప్పేసిందో సంస్థ. గుడ్‌షెపర్డ్, ఆర్ఆర్ ఫౌండేషన్ పేరుతో విజయవాడ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు ప్రారంభించిన నిందితులు పాస్టర్లు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. రూ. 10 వేలు కడితే రూ. 10 లక్షలు ఇస్తామని కొందరిని, రూ. 5 లక్షలు కడితే తమిళనాడులో 5 సెంట్ల స్థలం ఇస్తామని మరికొందరిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు లోబదిబోమంటున్నారు. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లోని నేషనల్ క్రిస్టియన్ బోర్డు కార్యాలయంలో బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్‌ను బాధితులు నిన్న కలిసి గోడు వెల్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

50 మంది వరకు బాధిత పాస్టర్లు, క్రైస్తవులు కలిసి ఆయనకు కష్టాలు చెప్పుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ బాధితులు వేలాదిమంది ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, నిందితులు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పేరు వాడుకుని మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జాన్ మాస్క్ మాట్లాడుతూ. బాధితుల తరపున నిలబడతానని హామీ ఇచ్చారు. పాస్టర్లు, క్రైస్తవులే కాకుండా గ్రూపులకు కోటి వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసగించినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. బాధితులతో కలిసి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijayawada
Andhra Pradesh
Telangana

More Telugu News