Supreme Court: ఏపీ ప్రభుత్వానికి ఊరట.. ‘సిట్’పై స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు!

  • అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు కోసమని గతంలో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం 
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేతలు.. స్టే ఇచ్చిన ధర్మాసనం
  • సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ సర్కారు
big relief for ap government in supreme court on sit investigation of amaravati land issues

అమరావతి భూకుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సూచించింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది.

గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిట్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఊరట లభించింది.

More Telugu News