ipl: మైదానంలో ముంబైని గెలిపించి.. బయట చిన్నారుల మనసులు గెలిచిన సూర్యకుమార్

  • రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ముంబై ఉత్కంఠ విజయం
  • అర్ధ సెంచరీతో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్
  • తింటున్న ప్లేట్ పక్కనబెట్టి  చిన్నారులతో ఫొటోలు దిగిన ముంబై బ్యాటర్
Mumbai batter Surya Kumar yadav  winning on and off the field

టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఐపీఎల్ లో వరుస వైఫల్యాల తర్వాత అతను మళ్లీ బ్యాట్ కు పని చెబుతున్నాడు. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ ఇచ్చిన 213 పరుగులు ఛేదనలో సూర్య 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. తనదైన శైలిలో షాట్లు కొట్టి అభిమానుల మనసు గెలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను చేసిన పనికి మరిన్ని ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఆట ముగిసిన తర్వాత వాంఖడే స్టేడియం బయట జట్టు బస్సు ఎక్కేముందు స్నాక్స్ తింటున్న సూర్యను చూసి కొంత మంది చిన్నారి అభిమానులు ముందుకొచ్చారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇది చూసిన సూర్య వారిని తన వద్దకు రమ్మన్నాడు. తింటున్న ప్లేట్ పక్కనబెట్టి చిన్నారులతో సెల్ఫీలు ఇచ్చాడు. ఓపిగ్గా వారి ఫోన్లలో తానే ఫొటోలు తీశాడు. అడిగిన వారికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. దాంతో, ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.  ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. సూర్య మైదానం లోపల, బయట మనసులు గెలుస్తున్నాడని క్యాప్షన్ ఇచ్చింది.

More Telugu News