YS Vivekananda Reddy: కేసు గురించి మాట్లాడకుండా.. వివేకానందరెడ్డి అక్బర్‌బాషాగా మారారంటారా?: అవినాశ్‌రెడ్డిపై షారూఖ్ షిబ్లీ ఫైర్

  • ముస్లిం సమాజాన్ని అవినాశ్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారన్న మైనార్టీ హక్కుల నేత
  • విశ్వసనీయత, పరువు మర్యాదలు వైఎస్ కుటుంబానికే సొంతం కాదని మండిపాటు
  • అవినాశ్ రెడ్డి అలా మాట్లాడడం బాధించిందన్న షిబ్లీ
Muslim Leader Shah Rukh Shibli Fires On YS Avinash Reddy

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న విజయవాడలోని సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అవినాశ్ రెడ్డి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం బాధించిందన్నారు. విశ్వసనీయత, పరువు, మర్యాదలు వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు.

హత్య గురించి మాట్లాడకుండా వివేకానందరెడ్డి అక్బర్‌బాషాగా మారారని, వీరికి షేక్ షెహన్‌షా అనే కుమారుడు ఉన్నాడని, వారిని విచారించాలని అవినాశ్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. ఇదే కేసులో గతంలో టీడీపీపై ఆరోపణలు చేశారని, నారాసుర రక్త చరిత్ర అని ఆరోపించిన విషయాన్ని మర్చిపోయారా? అని నిలదీశారు. అసలు విశ్వసనీయత అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాపాడేందుకు తమ సమితి లీగల్ టీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం నాలుగు సంవత్సరాలుగా నయా పైసా తీసుకోకుండా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. వివేకా హత్యకేసులో డ్రైవర్ దస్తగిరి తన తప్పు తెలుసుకుని అప్రూవర్‌గా మారాడని, వాస్తవాన్ని వెల్లడించాడని అన్నారు. అలాంటి ముస్లిం సమాజంపై అవినాశ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని షారూఖ్ షిబ్లీ హితవు పలికారు.

More Telugu News