SSMB29: రాజమౌళి సినిమాలో మహేశ్​ పాత్రపై వస్తున్నవన్నీ పుకార్లే: విజయేంద్ర ప్రసాద్

  • రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయనున్న మహేశ్
  • ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తదుపరి ప్రాజెక్టుపై విపరీతమైన క్రేజ్
  • ఇందులోని మహేశ్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం
Writer Vijayendra Prasad shuts down rumour about SSMB29

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించబోతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేశ్ కెరీర్ లో ఇది 29వ చిత్రం. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మహేశ్ ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత రాజమౌళి సినిమాకు డేట్స్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం కావడంతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’పై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఉండబోతుందని, ప్రపంచంలోని అనేక అడవుల్లో సినిమాను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.

 ఇక ఈ చిత్రంలో హీరో మహేశ్‌ పాత్రను హనుమంతుడు స్ఫూర్తితో రాశారన్న వార్త కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. ‘రాజమౌళికి పౌరాణిక కథలు ఇష్టం. వాటి నుంచి ప్రేరణ పొందుతాడు. తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయి. రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. కానీ, మహేశ్‌బాబు పాత్ర హనుమాన్‌ స్ఫూర్తితో ఉండదు. అలాగే ఏ పౌరాణిక పాత్రతోనూ పోలి ఉండదు’ అని స్పష్టం చేశారు. అది పుకారు మాత్రమే అని తేల్చారు. కాగా, రాజమౌళి–మహేశ్ చిత్రంలో హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంకా ఖరారు కాలేదు.

More Telugu News