సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కవిత!
- తాను ఈ రోజు సుప్రీంలో ఎలాంటి పిటిషన్ వేయలేదన్న కవిత
- గతంలో దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 24న విచారణకు వస్తుందని వెల్లడి
- ఓ న్యూస్ చానల్ లింక్ తోపాటు ట్వీట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఈనెల 11న ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. గురువారం జరగాల్సిన రెండో విడత విచారణకు ఆమె వెళ్లలేదు. ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. ఈనెల 24న విచారణ జరుపుతామని ధర్మాసనం చెప్పింది. కోర్టు తీర్పు తర్వాతే విచారణకు హాజరువుతానని కవిత లేఖ రాయగా.. ఈడీ అధికారులు తిరస్కరించారు.
ఈ నెల 20న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ మరోసారి కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారని, అత్యున్నత ధర్మాసనం అందుకు నిరాకరించిందని, ఈనెల 24నే విచారణ జరుపుతామని చెప్పిందని శుక్రవారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తన ట్వీట్ ద్వారా కవిత తెలియజేశారు.