Revanth Reddy: అప్పటికప్పుడు కొరమేను చేపలు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి కోసం వండిన ముదిరాజ్ యువకుడు

  • హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర
  • చేపల కూరతో భోజనం పంపిన కిరణ్ ముదిరాజ్ కుటుంబం
  • ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అంటూ రేవంత్ ట్వీట్
Mudiraj youth prepares Murrel fish curry for Revanth Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కొరమేను చేపలతో కూర వండి భోజనం పంపించింది. చేపలకూరను వారే స్వయంగా ఆయనకు అందజేశారు. ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి... కిరణ్ ముదిరాజ్ అనే యువకుడి ఇంటికి వచ్చారు. రేవంత్ రాక నేపథ్యంలో కిరణ్ చెరువులోంచి కొరమేను చేపలను పట్టుకొచ్చారు. ఆ తాజా చేపలతో రుచికరమైన పులుసుతో పాటు, ఫ్రై చేసి రేవంత్ కు పసందైన భోజనం అందించారు. 

దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు.

More Telugu News