Atchannaidu: సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలి: అచ్చెన్నాయుడు

  • పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ స్పీచ్
  • తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, తాను సింహంలా వెళుతున్నానని వ్యాఖ్యలు
  • ఒంటరిగా ఉండడానికి, వెలివేయడానికి తేడా ఉందన్న అచ్చెన్న
  • ఒంటరి పురుష పెన్షన్ కు అప్లై చేసుకోవాలంటూ సెటైర్
Atchannaidu satires on CM Jagan

ఏపీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండ సభలో ప్రసంగిస్తూ, తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, మీ బిడ్డ సింహంలా ఒక్కడే వాటికి ఎదురెళుతున్నాడు అని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 

సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఒంటరిగా ఉండడానికి, వెలివేయడానికి చాలా తేడా ఉందని తెలిపారు. ఇవాళ జగన్ ప్రసంగం చూస్తే... వెనకటికి ఎవడో తల్లిదండ్రుల్ని చంపేసి, నాకెవరూ లేరు, నాపై జాలి చూపించండి అని జడ్జిని దేబిరించినట్టుంది అని ఎద్దేవా చేశారు. 

"తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్ గా ఉంటానని చెప్పుకోవడం హాస్యాస్పదం. చేసిన పాపాలు... పాల్పడిన దారుణాలు.. వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్ గా మిగిలావు. ఆ ఒంటరితనం నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో నేను సింహాన్ని, సింగిల్ గా వస్తున్నా అంటూ సినిమా డైలాగులు వాగుతున్నావ్. 

ఒంటరిగా వస్తానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డీ... వెళ్లి నీ కబుర్లు నీ వాలంటీర్లకు చెప్పుకుని ఒంటరి పురుష పెన్షన్ కు అప్లై చేసుకో. అంతేగానీ ఇలాంటి దిక్కుమాలిన డైలాగులు విని నిన్ను నమ్మేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకో. 

ప్రతిపక్షంలో ఉండగా నువ్వు ఇచ్చిన హామీలు, చేసిన ప్రసంగాలు చూసి ప్రజలు నిజమేనని నమ్మి ఒట్లేసి గెలిపించారు. నీ చెత్త పాలన, చేవ చచ్చిన ప్రసంగాలు చూసి సభలకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు, అధికారులు లేకపోతే సభల్లో ఉండేది నువ్వు ఒక్కడివే. ఆ నిజం తెలిసి కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. 

ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నీ పిచ్చిపై ప్రజలకు క్లారిటీ వచ్చేసి నిన్ను ఒంటరిని చేశారు. నీ పార్టీ నుండి కూడా నేతలంతా బయటికెళ్లి నిన్ను ఒంటరిని చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకనైనా ఈ తిక్క డైలాగులు మాని ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ప్రజలకు ఏం చేశావో గుర్తు చేసుకో" అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

More Telugu News