Pawan Kalyan: ఎన్నికలప్పుడు విపరీతంగా జనం వచ్చారు... కానీ ఓట్లేసే సమయానికి నన్ను వదిలేశారు: పవన్ కల్యాణ్

  • శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ
  • తనకు తెలిసిందల్లా పోరాటం ఒక్కటేనన్న పవన్ కల్యాణ్
  • వెధవలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని వెల్లడి
  • రెండు చోట్ల ఓడిపోయినా బాధపడలేదని వ్యాఖ్యలు
Pawan Kalyan says he is for people

గెలుస్తానో, ఉంటానో, ఓడిపోతానో తనకు తెలియదని, తనకు తెలిసిందల్లా పోరాడడం ఒక్కటేనని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, గూండా గాళ్లను తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసని, వెధవలను ఎలా ఎదుర్కోవాలో తెలుసని పేర్కొన్నారు. భాష, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నవి కావని, వీటన్నింటిని దాటుకుని గుర్రం జాషువా ప్రవచించిన విశ్వనరుడి వైపు పయనించడమే ప్రతి మనిషి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. 

"పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. నా అకౌంట్ లో ఉన్నదల్లా కేవలం రూ.13 లక్షలే. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా యాత్ర మొదలుపెట్టాను. ఎక్కడికక్కడ అంబేద్కర్ భవనాల్లో, కల్యాణమండపాల్లో బస చేసేవాడ్ని. అయినా నేను చూడని డబ్బా? నేను చూడని పేరుప్రఖ్యాతులా? కానీ ప్రజల తరఫున ప్రజల్లో ఒకడిగా పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. రోడ్డు మీద పడుకోవడానికైనా నేను సిద్ధమే. కావాలనుకుంటే ఈ క్షణం సుఖాలను వదిలేయగలను. 

గత ఎన్నికల్లో నా సభలకు జనం తరలివచ్చారు... కానీ ఓట్లేసే సమయానికి నన్ను వదిలేశారు. చట్టసభల్లో ఎదిరించి నిలబడేందుకు అవసరమైన సత్తా ఇవ్వలేకపోయారు. రెండు చోట్ల ఓడిపోయావు అని కించపరుస్తూ ఉంటే దాన్ని యుద్ధం తాలూకు గాయంగానే భావించాను. అంతేతప్ప, నేనేం బాధపడలేదు... అవమానంగా భావించలేదు. 

ఆశయం ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని నమ్మేవాడ్ని. ఈ రణస్థలంలో మాట ఇస్తున్నా.... తుదిశ్వాస విడిచే వరకు రాజకీయాలను వదిలివెళ్లను, ప్రజల వెన్నంటే ఉంటాను. దీన్ని నా మూడో తీర్మానంగా తీసుకోండి" అని ఉద్ఘాటించారు.

More Telugu News