KCR: కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయింది: సీఎం కేసీఆర్

  • మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన వైనం
  • తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు అని వెల్లడి
  • ఇప్పుడది రూ.11.5 లక్షల కోట్లకు పెరిగిందని వివరణ
CM KCR speech in Mahabubabad

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేంద్రం అసమర్థత, వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు ఉండేదని, ఇవాళ దాన్ని రూ.11.5 లక్షల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. 

"కానీ కేంద్రం సరిగా పరిపాలన చేయకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది నేను చెబుతున్న లెక్క కాదు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ తేల్చి చెబుతున్న లెక్కలు ఇవి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్థాయిలో పనిచేసినా ఇవాళ మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండాలి. కానీ మనం రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయాం. ఆ తప్పు తెలంగాణది కాదు, కేంద్రానిది" అని వివరించారు. 

నదుల్లో అవసరానికి మించి నీళ్లు ఉంటాయని, కానీ ఆ నీళ్లన్నీ భూమి మీదకు రావని సీఎం అన్నారు. దశాబ్దాలు గడచిపోయినా ఇలాంటి సమస్యలు పరిష్కారం కావని, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు కానీ ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. 2004లో ఏర్పాటు చేశారని, 19 ఏళ్లు గడిచినా ఆ ట్రైబ్యునల్ వల్ల ఏం ఒరిగిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కాలం ట్రైబ్యునల్ తీర్పుకే పోతే, ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు ఆమోదం పొందాలి, అనుమతులు ఎప్పుడు రావాలి, ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? అన్నారు.   

గోదావరి కిందికి ఉంటుంది, మన భూమి పైకి ఉంటుంది కాబట్టి మనం మొండిగా ముందుకు వెళ్లి కాళేశ్వరం కట్టుకుని నీళ్లు తెచ్చుకోగలిగామని వివరించారు. దాంతో రైతుల ముఖాలు కొంచెం కళకళలాడుతున్నాయని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో నీటి సమస్యలు ఉన్నాయని, నీళ్లు తగినన్ని ఉన్నా ప్రజలకు అందుబాటులోకి రావని, కరెంటు సమస్యలు ఉన్నాయని వివరించారు. కానీ దేశం మొత్తమ్మీద ఇలాంటి సమస్యలను అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. 

సమాజం అద్భుతంగా పురోగమించాలంటే... శాంతితో, సహనంతో, సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలని హితవు పలికారు. అంతేతప్ప, మత పిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను విభజించాలని చూస్తే అదొక నరకంలా, తాలిబన్ వ్యవహారంలా, ఒక ఆఫ్ఘనిస్థాన్ లా, నిప్పుల కుంపటిలా తయారవుతుందని స్పష్టం చేశారు. విద్వేషాలతో జాతి జీవనాడి దహించుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకే యువత మేధావులతో చర్చలు ఏర్పాటు చేసి సన్మార్గంలో ముందుకు పోవాలని సూచించారు. 

తాను ఎంత చెప్పినా, కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే యావత్ దేశాభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చైతన్య వీచికలు తెలంగాణ నుంచి వీయాలని, అందులో మీ అందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

More Telugu News