Delhi Liquor Scam: ‘రాజగోపాల్ అన్నా.. తొందరపడకు, మాట జారకు’.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్

  • ఛార్జ్‌షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉందన్న రాజగోపాల్ రెడ్డి 
  • 28 సార్లు కాదు 28 వేల సార్లు చెప్పినా అబద్ధం నిజం కాదన్న కవిత 
  • కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ట్వీట్ కూ కవిత ఘాటు రిప్లై
  • తన చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందంటూ కవిత ట్వీట్ 
mlc kavitha counter to bjp leader komatireddy rajagopal reddy

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్‌షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉందని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ‘రాజగోపాల్ అన్నా.. తొందరపడకు, మాట జారకు!! " 28 సార్లు " నా పేరు చెప్పించినా, " 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు’ అని కవిత ట్వీట్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. కవిత ఇవ్వాల్సిన వివరణలు చాలా ఉన్నాయని మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు.

మాణిక్కం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. ‘నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి. అబద్ధం. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది’ అని ఎమ్మెల్సీ కవిత వివరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చడంపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చార్జిషీట్ లో తన పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

More Telugu News