Bharat Jodo Yatra: 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర.. జైపూర్ లో ప్రత్యేక కచేరి ఏర్పాటు

  • సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన యాత్ర
  • ఇప్పటికి 2600 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ
  • ప్రస్తుతం రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత
Bharat Jodo Yatra completes 100 days Congress to mark the milestone with live concert in Jaipur

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది. రాహుల్ దాదాపు 2,600 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజస్థాన్‌లోని మీనా హైకోర్టు దౌసా నుంచి వందో రోజైన, శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో యాత్రను పునఃప్రారంభించారు. 

భారత్ జోడో యాత్ర 100 రోజుల మార్కు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ డీపీని ‘100 రోజుల యాత్ర’గా మార్చారు. కాగా, మీనా హైకోర్టు నుంచి ప్రారంభమయ్యే 100వ రోజు యాత్ర ఉదయం 11 గంటలకు గిరిరాజ్ ధరన్ ఆలయం వద్ద రాహుల్ కొన్ని గంటలు విరామం తీసుకుంటారు. 

అనంతరం జైపూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 7 గంటలకు  లైవ్ కన్సర్ట్ తో (ప్రత్యక్ష ప్రదర్శనతో) రాష్ట్ర కాంగ్రెస్ కచేరీని ఏర్పాటు చేసింది. దీనికి రాహుల్ హాజరవుతారు. 

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహించ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లను దాటుకొని రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్ లో ప్రస్తుతం 12వ రోజు యాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్‌ను కవర్ చేసిన తర్వాత ఈ నెల 21 న హర్యానాలోకి ప్రవేశిస్తుంది.

More Telugu News